నా మిత్రుడు రజనీకాంత్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: కమలహాసన్

  • మా పార్టీ తమిళనాడులో బలమైన శక్తిగా అవతరిస్తుంది
  • పార్టీలో చేరేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్నారు
  • ఎన్నికల సమయంలో రజనీ మద్దతు తీసుకుంటా
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తమ పార్టీ బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత తమ పార్టీ అతిపెద్ద మూడో కూటమిగా అవతరిస్తుందని తెలిపారు.

క్షేత్ర స్థాయి నుంచి పార్టీని  బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు చాలా గొప్పవని... వాటికి ఆకర్షితులై ఎంతో మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ప్రతి ఒక్కరికీ తమ పార్టీ స్వాగతం పలుకుతుందని చెప్పారు. తమ పార్టీని బీజేపీకి మద్దతు ప్రకటించే పార్టీగా కొందరు ప్రచారం చేస్తున్నారని... తమ పార్టీ ఏ పార్టీకి బీటీమ్ కాదని అన్నారు.

తన ప్రియమిత్రుడు రజనీకాంత్ కు రాజకీయాల కంటే ఆరోగ్యమే ముఖ్యమని చెప్పారు. రజనీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో రజనీ మద్దతును తాను కోరుతానని చెప్పారు. అయితే, తన సొంత పార్టీని ప్రారంభించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది రజనీయే అని అన్నారు. మనుధర్మంపై విమర్శలు చేయడం ఇప్పుడు అనవసరమని చెప్పారు.

Kamal Haasan
Rajinikanth
Tamilnadu
toll

More Telugu News